
మెంటాడ: న్యూస్: యువత మాదకద్రవ్యాలకు బానిసలై జీవితం నాశనం చేసుకోవద్దని ఆండ్ర ఎస్సై సీతారాం అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం మండల కేంద్రంలో ఎస్సై సీతారాం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలను చిన్నాభిన్నం చేసుకోకూడదని జీవితాలను నాశనం చేసే మత్తు పదార్థాలకు విద్యార్థులు యవ్వనస్తులు అందరూ దూరంగా ఉండాలని తెలిపారు. మాదకద్రవ్యాలు అమ్మిన, వాడిన ,రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని బెయిల్ కూడా దొరకదని హెచ్చరించారు. ఎంత చదువుకున్నా ,ఎంత డబ్బున్నా, ఎంత పరపతి ఉన్నా ఒక్కసారి మాదకద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం సర్వనాశనం అయిపోతుందని అందుకు ఎంతోమంది ఉదాహరణగా నిలిచారని మాదకద్రవ్యాల వినియోగంపై వచ్చే ప్రమాదాలను విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భానుమూర్తి, ఎమ్మార్వో అరుణ కుమారి, వైద్య అధికారిని లోకప్రియ, పంచాయతీ విస్తరణాధికారి విమల కుమారి సి.హెచ్.ఓ సత్యనారాయణ అంగన్వాడి సూపర్వైజర్ ధనలక్ష్మి, పోలీస్ సిబ్బంది, టిడిపి పార్టీ నాయకులు రాయి పిల్లి రవిశంకర్ వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.